Anant Ambani | సెలబ్రిటీల వివాహాలంటేనే ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు.. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలుకుంటే.. పెళ్లి తంతు ముగిసేదాకా ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంటుంది. అపక కుబేరుడు అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుక అంటే ఇంకెంతో స్పెషల్గా ఉంటుంది. అందులో అనుమానమే అక్కర్లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక జులై నెలలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్కు సంబంధించి రోజుకో ప్రత్యేకత బయటికొస్తోంది.
గుజరాత్లోని జామ్ నగర్లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. అయితే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి వడ్డించకుండా విందు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
2,500 వంటకాల తయారీ కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 21 మంది చెఫ్లను పిలిపించినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అతిథులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్లో 75 వెరైటీలు, లంచ్లో 225, డిన్నర్లో 275 రకాల వంటలను వడ్డించనున్నారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ జనవరి 19, 2023న ముంబైలో గోల్ ధన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.