న్యూఢిల్లీ, జూన్ 22: పురుగు మందులపై జీఎస్టీ భారాన్ని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ధనుకా అగ్రిటెక్ గ్రూపు చైర్మన్ ఆర్జీ అగర్వాల్ డిమాండ్ చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా విత్తనాలు, ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ మాదిరిగానే పురుగు మందులపై అంతే జీఎస్టీని విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే ఆగ్రో-కెమికల్స్ రంగాన్ని కూడా ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకం(ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) స్కీం పరిధిలోకి తీసుకురావాలని, అలాగే అంతర్జాతీయ తయారీ హబ్స్ను నెలకొల్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పంట నష్టాన్ని తగ్గించడంలో కీలక ముడి పదార్థామైన పురుగుల మందని, ఇలాంటి ఉత్పత్తిపై అధిక జీఎస్టీ విధించడంతో రైతులపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతున్నదని, దీనిని వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఆగ్రో కెమికల్స్ ముడి పదార్థాల దిగుమతిపైన కూడా దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ఆయన సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంట నష్టాన్ని నివారించే పురుగు మందులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఫిక్కీ పంట భద్రత కమిటీ చైర్మన్గాను విధులు నిర్వహిస్తున్న అగర్వాల్..మార్గదర్శకాల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని, నూతన పరిశోధనకోసం రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ను మరింత వేగవంతం చేయాలన్నారు.