న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. దేశీయంగా ప్రీమియం వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆరు నెలల్లో ప్రత్యేకంగా 100 ప్రీమియం రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో వాహన కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయని, దీంతో లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని వాటాదారులతో జరిగిన సమావేశంలో ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయ ఆర్థిక రంగం దూసుకుపోతున్నదని, ప్రపంచ దేశాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నది కూడా మన దేశమేనని ఆయన పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితులు కొంతే
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వాహన విక్రయాలపై కొంతమేర ప్రభావం చూపనున్నాయని, అయినప్పటికీ రబీ పంట ఆశించిన స్థాయి కంటే అధికంగా ఉండటం ఇందుకు కారణమన్నారు. దీంతో ఈ ఏడాది పండుగ సీజన్లో వాహన అమ్మకాలు పెరిగాయని చెప్పారు. గత నెలలో 18,95,799 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో అమ్ముడైన 15,78,383 యూనిట్లతో పోలిస్తే 20 శాతం పెరిగాయని సియామ్ నివేదిక వెల్లడించింది.
తొలి ప్రీమియం స్టోర్ ప్రేమియా..
కేవలం ప్రీమియం బైకులను విక్రయించడానికి ప్రేమియా పేరుతో రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేసింది. ఇటీవల తన తొలి అవుట్లెట్ను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో మరో 100కి పైగా ఈ స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు, ఇప్పటికే 200కి పైగా స్టోర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈవీల వ్యాపారంపై ఆయన స్పందిస్తూ..ఇది కొనసాగుతున్నదని, ఇప్పటికే 100 నగరాల్లో ఈవీ స్కూటర్లను విక్రయిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.