ముంబై, సెప్టెంబర్ 29: రిజర్వ్బ్యాంక్ వరుసగా నాల్గోసారి వడ్డీ రేటును పెంచుతుందన్న ఏకాభిప్రాయం ఆర్థికవేత్తలు, విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. అంతర్జాతీయ కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్న నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయం శుక్రవారం వెలువడనుంది. ఆర్బీఐ బెంచ్మార్క్ రేటైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర మానిటరీ పాలసీ కమిటీ పెంచవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు దఫాల రేట్ల పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈ రేట్ల పెంపు చాలావరకూ దేశీ ఆర్థిక సంకేతాలకు అనుగుణంగా ఉంటుందని, భారత్ వృద్ధి రేటుకు, ద్రవ్యోల్బణానికి ఏర్పడిన రిస్క్ల్ని పరిగణనలోకి తీసుకుని రేట్లను ఆర్బీఐ పెంచుతుందని ఆర్థిక వేత్తలు వివరిస్తున్నారు.
అంతర్జాతీయ వృద్ధి మందగమనం కారణంగా దేశీ వృద్ధికి రిస్క్ ఏర్పడిందని, ద్రవ్యోల్బణం రిస్క్లు చాలావరకూ దేశీయ పరమైనవని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకానమిస్ట్ సోనాల్ బధాన్ చెప్పారు. కరెన్సీ, బాండ్ల మార్కెట్లలో ఒడిదుడుకుల్ని సైతం ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని రేట్లను ప్రకటిస్తుందన్నారు. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్ నిర్దేశిత స్థాయి 6 శాతానికి మించే ప్రస్తుతం ఉన్నందున, రేట్ల పెంపును ఆర్బీఐ కొనసాగిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ సాక్షి గుప్తా చెప్పారు. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వరుసగా మూడోదఫా 75 బేసిస్ పాయింట్లు పెంచడం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం 75 బేసిస్ పాయింట్లు అధికం చేయడాన్ని గమనిస్తే అంతర్జాతీయ కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని కఠినంగానే ఉంచుతాయని తాము భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కూడా ముందస్తుగానే రేట్లను పెంచుతుందని, ఈ సంవత్సరాంతానికి రెపో రేటు 6.25-6.5 శాతానికి చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు గుప్తా వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా (క్యాడ్) లోటు భారీగా పెరిగింది. విదేశాల నుంచి దేశం స్వీకరించే, చెల్లించే మొత్తాన్ని ప్రతిబింబించే క్యాడ్ 2022 ఏప్రిల్-జూన్ మధ్య జీడీపీలో 2.8 శాతానికి (23.9 బిలియన్ డాలర్లు) పెరిగినట్టు రిజర్వ్బ్యాంక్ గురువారం విడుదల చేసిన డాటా వెల్లడిస్తున్నది. వాణిజ్యలోటు పెరగడం, పెట్టుబడుల ఆదాయ చెల్లింపులకు సంబంధించి దేశం నుంచి నికరంగా నిధులు తరలివెళ్లడం వంటి అంశాలతో క్యాడ్ పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఈ లోటు 1.5 శాతంకాగా (13.4 బిలియన్ డాలర్లు), గత ఏడాది ఏప్రిల్-జూన్లో 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగులు నమోదయ్యిందని ఆర్బీఐ తెలిపింది. 2021-22 నాల్గో త్రైమాసికంలో వాణిజ్యలోటు 54.5 బిలియన్ డాలర్ల నుంచి 68.6 బిలియన్ డాలర్లకు చేరడం, పెట్టుబడుల ఆదాయంపై నికర చెల్లింపులు పెరగడం క్యూ1లో కరెంట్ ఖాతాలోటుపై ప్రభావం చూపించినట్లు ఆర్బీఐ పేర్కొంది. కంప్యూటర్, బిజినెస్ సర్వీసుల ఎగుమతులు అధికంకావడంతో నికర సేవల వసూళ్లు త్రైమాసికంవారీగా, వార్షిక ప్రాతిపదికన పెరిగాయి. సర్వీసుల ఎగుమతులు గత ఏడాది తొలి త్రైమాసికం కంటే ఈ ఏడాది 35.4 శాతం పెరిగాయి. ఎన్నారైలు దేశంలోకి పంపించే రెమిటెన్సులతో కూడిన ప్రైవేటు బదిలీల వసూళ్లు 22.6 శాతం వృద్ధిచెంది 25.6 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్టుబడుల ఆదాయంపై నికర చెల్లింపులు 7.5 బిలియన్ డాలర్ల నుంచి 9.3 బిలియన్ డాలర్లకు చేరాయి. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 11.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్లకు చేరాయి. నికర విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు 14.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.