హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీతోపాటు ఎనర్జీ స్టోరేజీ పాలసీని అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎనర్జీ స్టోరేజీ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈవీలను ప్రోత్సహించడంపై శనివారం గోవాలోని కనకోనలో ఎలక్ట్రిక్ మొబిలిటీపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనర్జీ స్టోరేజీ రంగంలో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2030 నాటికి 1.20 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాలతోపాటు, ప్రజా రవాణాలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రొత్సహిస్తున్నామన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీ వాహనాలను కొనుగోలు చేసేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారని, దీంతో హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరుగుతున్నది చెప్పారు. 2016లో తెలంగాణలో కేవలం 25 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడు వాటి సంఖ్య 10 వేలకుపైగా పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సొంతగా రూ.27 లక్షలు వెచ్చించి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఢిల్లీ, గుజరాత్ తర్వాత ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని రూపొందించిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ప్రొత్సహించేందుకు పలు రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. మొదటి 2 లక్షల ద్విచక్రవాహనాలు, 2 వేల ఆటోలు, 10 వేల లైట్ గూడ్స్ వాహనాలు, 5 వేల ఎలక్ట్రిక్ కార్లు, 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపునిస్తున్నట్లు వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ వాహనాలకు (ఈవీలు) ఫాస్ట్ ఛార్జర్లు తీసుకొచ్చేందుకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యిందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ఫాస్ట్ ఛార్జర్ ప్రొటోటైప్ను అభివృద్ధిపర్చిందని, 2022 డిసెంబర్కల్లా ఈ ఉత్పత్తి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా పాండే మాట్లాడుతూ ఫాస్ట్ ఛార్జర్లతో ఛార్జింగ్ సమస్యలు తొలగిపోయి, బ్యాటరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 22,000 పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నామని మంత్రి పాండే వివరించారు.