న్యూఢిల్లీ, మార్చి 27: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలన్న లక్ష్యం కష్టమైనదేమీ కాదని, అది సులభంగా, త్వరగా సాధించగల లక్ష్యమేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ ఉద్ఘాటించారు. ఇందులో కేవలం జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారానే ప్రభుత్వం రూ.లక్ష కోట్లు సమీకరించుకోగలదన్నారు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2021-22లో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలన్న లక్ష్యం.. ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి కొనసాగింపేనన్నారు. ‘ఈ లక్ష్య సాధనలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఎల్ఐసీ ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. కేవలం బీపీసీఎల్ ప్రైవేటీకరణ ద్వారానే రూ.75 వేల నుంచి 85 వేల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులు రావచ్చన్న అంచనాలున్నాయి. అలాగే ఎల్ఐసీ ఐపీవో ద్వారా దాదాపు రూ.లక్ష కోట్లు సమీకరించుకునేందుకు వీలున్నది’ అని ఆయన వివరించారు.
బీపీసీఎల్ ప్రైవేటీకరణతో మరో రూ.80 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సులువైనదే: సుబ్రమణియన్