హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కంపెనీల ఆర్థిక నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి పేర్కొన్నారు. ఇందులో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల(సీఎఫ్ఓ) పాత్ర కీలకమని ఆమె చెప్పారు. సీఐఐ-తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం ‘సీఎఫ్ఓ 4.0- బియాండ్ బౌండ్రీస్’ అనే అంశంపై జరిగిన వర్చువల్ సదస్సులో శ్రీదేవి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్స్ విజయవంతమైన వ్యాపార వ్యూహంగా మారిందని పేర్కొన్నారు. దొడ్ల డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నట్లు చెప్పారు. సైఫై టెక్నాలజీస్ సీఎఫ్ఓ విజయ్ కుమార్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ బిజినెస్-ఫైనాన్స్ హెడ్ ఎంవీ నరసింహమ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.