టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధికార వైసీపీ కౌంటర్ ఎటాక్కు దిగింది. ఏపీలో ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా… వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని, ఒక్క సీటు కూడా తగ్గదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే.. ఇప్పుడే పొత్తుల విషయాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబుకు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, మరో 25 సంవత్సరాల పాటు ఏదైమైనా… ఏపీకి జగన్ మాత్రమే సీఎంగా వుంటారని విజయసాయి స్పష్టం చేశారు. వైసీపీది అంతా సోలో ఫైటేనని చెప్పుకొచ్చారు.
ఇక… ఇదే విషయంపై ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు ఒంటరిగా వచ్చినా, అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని వచ్చినా, గెలిచేది తామేనని అన్నారు. విద్యుత్ చార్జీలు ఏపీలో కన్నా కర్నాటకలో ఎక్కువ ఉన్నాయని, మహారాష్ట్రలో బస్సు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటావో చెప్పాలని అంబటి సవాల్ విసిరారు.