ఏపీలోని అధికార వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. కొత్త మంత్రివర్గంలో ఛాన్స్ మిస్సైన వారు తీవ్ర ఆవేదనకు, అసంతృప్తికి లోనవుతున్నారు. వారి వారి కేడర్ మాత్రం ఏకంగా రోడ్లపైకి వచ్చేసింది. తమ నిరసనను వ్యక్తం చేస్తూనే వుంది. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇక రెండో నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. బాలినేని ఇంటికి సలహాదారు సజ్జల ఏకంగా రెండుసార్లు వెళ్లి భేటీ కావడం, ఆయనను బుజ్జగించడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరులు నిరసన ప్రదర్శనలకు దిగారు.
మాచర్ల పట్టణంలోని బస్టాండ్ దగ్గర, మాచర్ల- సాగర్ రహదారి దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు. రెంటచింతల- గుంటూరు ప్రధాన రహదారిపై టైర్లను తగలబెట్టి, నిరసన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అంతేకాకుండా ఓ బైక్ను కూడా దగ్ధం చేశారు. పిన్నెల్లికి మంత్రి పదవి రానందుకు నిరసనగా ఆయన మద్దతుదారురాలు, ఎంపీటీసీ సంపూర్ణ ఆ మంటల్లోకి దూకడానికి ప్రయత్నం చేసింది. పక్కనే వున్న పార్టీ శ్రేణులు అలర్ట్ కావడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇక.. తమ నేతకు మంత్రి పదవి రాకపోవడంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్తో సహా 30 మంది కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు.
తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నానని, అయినా తనకు మంత్రి పదవి రాలేదని, ఎంతో బాధపడుతున్నానని అన్నారు. అయినా తాను పార్టీలోనే వుంటానని స్పష్టం చేశారు. మరోవైపు కోటంరెడ్డికి మంత్రి పదవులు రాకపోవడంతో ఆయన మద్దతుదారులు, కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడ్డారు. కోటంరెడ్డి వద్దని నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మంత్రి పదవి రాలేదని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు 5 వ వార్డు కౌన్సిలర్ పదవికి మోమిన్ రాజీనామా చేశారు. ఇక.. కృష్ణా జిల్లా పెనుమలూరు, జగ్గయ్యపేట, తిరువూరు మండలాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఉదయభాను, పార్థసారథి అనుచరులు ఆందోళనకు దిగారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నేతకు మంత్రి పదవి రాలేదని, తాము రాజీనామాలు చేస్తామని కొందరు హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు కూడా ఆందోళనకు దిగారు. పెనమలూరు నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే తన అనుచరులను పార్థసారథి బుజ్జగించారు.
తిరువూరులో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్మిపురం, పొలిశెట్టిపాడు, టేకులపల్లి పీఏసీఎస్ చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పలువురు జడ్పీటీసీలు కూడా రాజీనామాలు చేశారు.
ఇక మాజీ మంత్రి మేకతోట సుచరిత ఇంటి వద్ద ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. సుచరితను కేబినెట్లోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ సందర్భంగా సుచరిత ఇంటికి బుజ్జగింపుల కోసం వచ్చిన మోపిదేవి వెంకట రమణను ఆమె అనుచరులు అడ్డుకున్నారు.