గుంటూరు : భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతు పెన్షన్ను అందిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఓ పురుషుడు వితంతు పెన్షన్ అందుకోవడం చర్చానీయాంశంగా మారింది. కర్నూల్ జిల్లాలోని డోన్ మండలానికి చెందిన కాశీం అనే వ్యక్తి ఇటీవలే ఉపాధి నిమిత్తం గుంటూరు జిల్లాకు వెళ్లాడు.
వినుకొండ మండలం చిట్టాపురంలో వితంతు పెన్షన్ కోసం కాశీం అధికారుల వద్దకు వెళ్లాడు. వితంతు పెన్షన్ కోసం వెళ్లిన కాశీంను చూసి అధికారులు విస్తుపోయారు. పురుషులకు వితంతు పెన్షన్ ఇవ్వడమేంటని అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా డోన్ మండల అధికారులకు వినుకొండ అధికారులు సమాచారం అందించారు. 2009 నుంచి కాశీం వితంతు పెన్షన్ అందుకున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారం ఇన్నేళ్లుగా సాగుతున్నా అధికారులు ఏమరుపాటుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.