హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వివేకా కూతురు నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలను వెల్లడించారు. దీంతో సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలంతో పాటు ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలను సీబీఐ కోర్టుకు సమర్పించారు. వైఎస్ వివేకా హత్య (YS Viveka Muredr ) జరిగిన కొద్దిరోజులకు 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి కలుస్తానని కోరగా తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్కు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని వెల్లడించారు.
అయితే కొద్ది నిమిషాల్లోనే భారతీతో పాటు ఆమె వెంట విజయలక్ష్మి , వైఎస్ అనిల్ రెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy ) కూడా రావడంతో ఆశ్చర్యానికి లోనయ్యానని సునీత వివరించారు. లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాట్లాడగా ఆమె ఆందోళనగా కనిపించారని పేర్కొన్నారు. ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్లో ఉండాలని భారతి చెప్పిందని అన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడాలని సజ్జల తనకు చెప్పారని, సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని సునీత చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియో పంపించానన్నారు.
అయితే ఆ వీడియో కాదు. హత్య కేసు అంశానికి ముగింపు పలికేలా ప్రెస్మీట్ పెట్టి జగనన్నతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారని వివరించారు. అయితే తాను అప్పటి వరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల సూచించినపుడు కొంత సంకోచించానన్నారు. సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టానని సునీత తెలిపారు.
క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోలేదు
2019 జులైలో అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం మొదలైందని, వివేకా మృతి విషయం బయటకు రాకముందే తన కుమారుడికి తెలుసునని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని సునీత పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందన్నారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదట్నుంచీ అడుగుతున్నానని, పొరపాటు జరిగిందని తెలుసు కానీ క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోలేదని సునీత అన్నారు.
జగనన్నను సీఎంగా చూడాలని తండ్రి వివేక చాలా కష్టపడ్డారన్నారు. ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని, తాను మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని, ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయన్నారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ తనకు చెప్పారని, అది మనసులో పెట్టుకొని టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ చెప్పారన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని సునీత తెలిపారు.ఈ క్రమంలో భారతి, సజ్జల వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సునీత అందజేశారు.