అమరావతి : ఏపీలో అధికార వైసీపీ (YCP) ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. తునిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు జగన్ దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా (Special Status) ను పక్కన పెట్టారని విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానుల (Capital) పేరిట మభ్యపెట్టి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు(Chandra Babu), జగన్ పాలనలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైన రాలేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్కు ఇవ్వాలని కోరారు.