ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. తనను శివుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాడు సమాజంలో తన శివుడు ఉండొద్దన్నాడని ఆయన రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడకు చెందిన వెంకట పూర్ణ శేఖర్రెడ్డి నిత్యం శివుడ్ని ఆరాధిస్తుంటాడు. తండ్రి చనిపోవడంతో చెన్నైలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. అయితే, ఇటీవల ఉన్నట్టుండి చెన్నై నుంచి సొంతూరికి వచ్చిన పూర్ణశేఖర్రెడ్డి.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేసరికి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడే ఆయన చేతిరాతతో ఉన్న నోట్లో శివయ్య పిలిచాడని.. అందుకే వెళ్లిపోతున్నానని రాశాడు. తన తండ్రి కూడా శివయ్య వద్దే పనిచేస్తున్నాడని.. తాను కూడా అక్కడికే వెళ్లిపోతున్నానని పేర్కొన్నాడు.
సోదరి సాయిలక్ష్మిని బాగా చూసుకోవాలి, ఆస్తులన్నీ ఆమె పేరిట రాసి మంచి అబ్బాయితో పెండ్లి జరిపించాలని సూసైడ్ నోట్లో పూర్ణశేఖర్రెడ్డి రాశాడు. వచ్చే జన్మలో సమాజానికి మేలు చేసేందుకు అవకాశం కల్పించాలని శివయ్యను వేడుకుంటానని ప్రస్తావించాడు. కాగా ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరైంది. భర్తను కోల్పోయి ఒకవైపు.. అండగా ఉండాల్సిన కొడుకు పోవడం మరోవైపు.. ఆ తల్లి రోధనను ఆపడం ఎవరి తరం కాలేదు. కాగా, పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పెద్దరవీడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.