AP News | ప్రాణంగా ప్రేమించానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి దారుణానికి తెగబడింది. తనను ప్రేమించి మరొకరిని పెండ్లి చేసుకున్నాడనే కక్షతో అతన్ని కిరాతకంగా హత్య చేసింది. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి నిద్రలేపి మరీ అతనిపై కత్తిపీటతో దాడి చేసి చంపేసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర రాజమహేంద్రవరంలో చదువుకుంది. ఆ సమయంలో గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (26)కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లే ఆ పరిచయం ప్రేమగా మారింది. నాలుగేండ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం ఏడాది క్రితం నాగశేషు ఇంట్లో తెలిసిపోయింది. దీంతో వాళ్ల ప్రేమను వ్యతిరేకించిన కుటుంబసభ్యులు గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓ యువతితో నాగశేషుకు వివాహం జరిపించారు. అయితే తనకు పెండ్లి జరిగిన విషయాన్ని ప్రియురాలి దగ్గర నాగశేషు దాచిపెట్టాడు. ఆమెతో ఎప్పటిలాగే సన్నిహితంగా ఉన్నాడు. నాగశేషుకు పెండ్లి జరిగిందన్న విషయం ఇటీవల డెబొరకు తెలిసిపోయింది. దీంతో నాగశేషుతో ఆమె పలుమార్లు గొడవపడింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నాగశేషు ఇంటికి డెబొర వెళ్లింది.
రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన తన స్నేహితుడు విశ్వనారాయణతో కలిసి నాగశేషు ఇంటికి వెళ్లిన డెబొర.. బిల్డింగ్పై పడుకున్న అతన్ని నిద్రలేపి మరీ గొడవకు దిగింది. ఒకవైపు వాగ్వాదం జరుగుతుండగానే.. తనవెంట తెచ్చుకున్న కత్తి పీటతో నాగశేషుపై డెబొర దాడి చేసింది. ఆమె స్నేహితుడు కర్రతో నాగశేషును కొట్టాడు. ఆ సమయంలో నాగశేషు కేకలు వేయడంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న నాగశేషును ఆంబులెన్స్లో రంపచోడవడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మార్గమధ్యలోనే నాగశేషు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెబొర, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.