బాపట్ల జిల్లా : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి రూ.10 లక్షల నగదును అందజేసింది. వాలంటీర్ కుటుంబానికి తమ పార్టీ అన్నివిధాలుగా తోడుగా నిలుస్తుందని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు. ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ నుంచి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో గ్రామ వాలంటీర్ చనిపోయిన విషయం తెలిసిందే.
ఐదు రోజుల క్రితం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న కనపర్తి ధినేష్ మృతిచెందాడు. మృతుడు ధినేష్ వేమూరు నియోజకవర్గం పరిధిలోని అమర్తలూరు మండలం గోవాడ గ్రామానికి చెందినవాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ధినేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పార్టీ తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. వాలంటీర్ కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి వారిని ఓదార్చారు.
ఈ నెల 9న వైఎస్సార్సీపీ ప్లీనరీకి వెళ్తుండగా నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధినేష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పార్టీ తరపున ఆర్థిక సాయం అందించాలని నేతలకు సూచించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి మేరుగ నాగార్జున సహాయ సహకారాలతో పార్టీ నేతలు ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు. జగనన్న బీమా పథకం ద్వారా కూడా ప్రయోజనం వచ్చేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.