హైదరాబాద్ : తెలంగాణలో వింత వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 37.6 డిగ్రీల నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలపైనే నమోదైనట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. గాలిలో తేమ శాతం తగ్గుతున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్లో గాలిలో తేమ 16 శాతం చొప్పున, జగిత్యాలలో 17 శాతం నమోదైంది.
గడిచిన 24 గంటల్లో నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 20.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం గురువారం పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నదని పేర్కొంది.