అమరావతి : చిత్తూర్ జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. నగరి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. రెబల్స్కు పెద్ద ఎత్తున డబ్బులు అందించి పోటీలో నిలిపారని ఆక్షేపించారు. శాసనసభ ఎన్నికల్లోనూ తననూ ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని అన్నారు.
ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో నగరిలో వైసీపీ వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం అందరినీ కలుపుకుని పోవాలని ఆదేశిస్తున్నా ఇక్కడ ఎవరి దారి వారిదే అన్నట్లు నేతలు వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతున్నది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజా ఏకంగా పోలింగ్ బూతు నుంచే అధిష్ఠానానికి లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నది.