అమరావతి: ఏపీలో అధికార వైసీపీ నాయకులు క్రూర జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నందిపాడులో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడడం అత్యంత విచారకరమని అన్నారు. అధికార పార్టీని గాని, వారి నాయకులను ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతుందని ఆరోపించారు.
వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని రేపు అనేది ఒకటి ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని , వైసీపీ పాల్పడ్డ దాడులకు భవిష్యత్లో తాము సమాధానం చెప్పడం ఖాయమని వెల్లడించారు. టీడీపీ కార్యకర్త వెంకట నారాయణకు ఏం జరిగినా అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.