Junior NTR | ఏపీలో బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు అనైతికమని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. గతంలో చంద్రబాబు, మోదీ పరస్పరం తిట్టుకున్నారని.. ఇప్పుడు అవన్నీ మరిచిపోయి మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు వారి కుట్రలను గమనిస్తున్నారని తెలిపారు. 40 శాతం ఓట్లు ఉన్న టీడీపీ.. 8 శాతం ఓట్లు ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. అమిత్ షా ఇంటి ముందు శివరాత్రి జాగారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించారని ఎద్దేవా చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అని.. చంద్రబాబుకు మద్దతివ్వడు అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. వరుణ్ తేజ్ ప్రచారం చేస్తే టీడీపీ పొత్తుకు ఓట్లు ఏమీ పడవని ఆమె అన్నారు. వాళ్లు రీల్ హీరోలే గాని రియల్ హీరోలు కాదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని స్పష్టం చేశారు.