అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పతనం అంచున ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. మంత్రివర్గ పునర్వీవ్యవస్థీకరణ చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ఆయన తెలిపారు. ఏపీ సీఎం జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో నిత్యవసర ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, సహజ వనరుల దోపిడీ, విద్యుత్ కోతలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు లాంటి ప్రజా సమస్యల పరిష్కరానికి కొత్త మంత్రివర్గం ఏర్పాటు ఎంతమాత్రం దోహదం చేయదన్నారు. మంత్రులపై వస్తున్న అవినీతి, అక్రమాలపై రాజీనామాలు కోరారా అని నిలదీశారు. కొంతమంది మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రతిపక్షంపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారని విమర్శించారు.