YS Jagan | మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు
కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి.. అధికారులతో వైసీపీకి బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తున్నదని పేర్కొంది.