అమరావతి : రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన నలుగురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్రావు గెలిచినట్లు డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం.
ఆర్. కృష్ణయ్యది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం రాళ్లడుగుపల్లి గ్రామం. బీసీ సంఘ ఉద్యమ నేతగా పేరున్న కృష్ణయ్య 2014లో ఎల్బీనగర్నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నిరంజన్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు సీనియర్న్యాయవాదిగా సేవలందిస్తున్న నిరంజన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులను వాదిస్తున్నారు.
కాగా నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామానికి చెందిన విజయసాయిరెడ్డి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పదవికాలం ముగియడంతో జగన్ ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బీద మస్తాన్రావు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పలు సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో్ నిర్వహించడంలో మంచి పేరు ఉంది.