తిరుపతి : మ్యాన్హోల్ ను శుభ్రం చేసేందుకు వెళ్లిన మున్సిపల్ కార్మికుడు విషవాయువు పీల్చి మృతి చెందిన ఘటన తిరుపతిలోని వైకుంఠపురంలో చోటు చేసుకుంది. వైకుంఠపురంలోని జంక్షన్ వద్ద ఉన్న మ్యాన్ హోల్ను శుభ్రం చేసేందుకు మ్యాన్హోల్ లో ఇద్దరు కార్మికులు దిగారు. దిగిన కొద్దిసేపటికే వారు విషవాయువు పీల్చి అస్వస్థకు గురయ్యారు. మ్యాన్హోల్ నుంచే హహాకారాలు చేయడంతో మరో కార్మికుడు వారిని రక్షించే యత్నంలో అతడు కూడా మ్యాన్ హోల్లో పడిపోయాడు.
స్థానికుల సమాచారంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆర్ముగం అనే కార్మికుడు చనిపోగా మరో ఇద్దరిని రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.