విజయవాడ పాత ప్రభుత్వ దవాఖానాలో దారుణం చోటుచేసుకున్నది. వైద్యం పొందుతూ బాలింత నీరజ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ యువతి తల్లిదండ్రులు, బంధువులు దవాఖానా వద్ద ఆందోళనకు దిగారు. బుధవారం వైద్యులు ఇంజక్షన్ చేయడం వల్లే తమ బిడ్డ సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె మరణించిందని, అయితే, ఏ కారణంతో చనిపోయిందో ఇప్పటివరకు వైద్యులు చెప్పడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
9 రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన నీరజ.. ఆరోగ్యం బాగోలేదని విజయవాడ పాత ప్రభుత్వ దవాఖానాకు వచ్చింది. అక్కడి వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అయితే, కొద్ది సేపటికే తనకు తల తిరుగుతున్నట్లుగా ఉన్నదంటూ నీరజ అక్కడున్న వారికి చెప్పింది. అనంతరం మాట కూడా మాట్లాడకుండా నిశ్చలంగా ఉండిపోయింది. చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించి బాలింత మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా ఆమె కుటుంబీకులకు తెలిపారు. అయితే, వైద్యం వికటించడం వల్లనే తమ కూతురు చనిపోయిందని నీరజ తల్లిదండ్రులతోపాటు కుటుంబసభ్యులు దవాఖానా వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ కుమార్తె నీరజ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని తమను ఒత్తిడి చేశారని మృతురాలి కుటుంబీకులు చెప్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించిందని, పోస్ట్మార్టం చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని వారంటున్నారు. మృతదేహానికి పోస్ట్మార్టం చేసిన తర్వాతే, అక్కడ్నుంచి కదులుతామని వారు కరాఖండితంగా చెప్పారు. మృతురాలు కుటుంబం నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వారు. పోలీసులు వారిని సముదాయించి పోస్ట్ మార్టం చేయించేందుకు చర్యలు చేపట్టారు.