కర్నూలు : ఓట్లేసి ఎమ్మెల్యేగా అందలం ఎక్కించిన ప్రజలే.. తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో నిలదీశారు. సున్నా వడ్డీ పథకంతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమకు అందడం లేదని, తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని మహిళలు, గ్రామస్థులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరు మండలంలో జరిగింది.
గూడూరులో సున్నా వడ్డీ పథకం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పథకాలపై ఎమ్మెల్యే వివరిస్తుండగా.. ఒక్కసారిగా లేచి నిల్చున్న మహిళలు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమ గ్రామంలో అమలు చేయడం లేదని ముక్తకంఠంతో ఎమ్మెల్యేను నిలదీశారు. పెద్ద మొత్తంలో పన్నులు పెంచితే ఎలా కడతామో చెప్పాలన్నారు. కలుషిత నీరు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు ఒక్కసారిగా గొంతు పెంచడంతో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. ఒకరిద్దరు మహిళలకు చెక్కులు అందించి తిరుగుముఖం పట్టారు. మహిళలు ఒక్క ఉదుటన వచ్చి ఎమ్మెల్య కారుకు అడ్డంగా నిల్చుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేలా చూస్తామని స్థానిక నేతలు నచ్చజెప్పడంతో ఆందోళన చేసినవారు శాంతించి వెళ్లిపోయారు.