చిత్తూరు : గత కొన్నేండ్లుగా ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. లక్షల మంది ఉపయోగించే వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ నుంచి ఓ కేటుగాడు ఇదే తరహాలో రూ 21 లక్షలు మోసగించాడు. మదనపల్లె పట్టణంలో రెడ్డెప్పనాయుడు నివాసి, రిటైర్డ్ టీచర్ వరలక్ష్మి తన ఖాతా నుంచి నగదు విత్డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో ఆమె స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని కాంటాక్ట్ నుంచి వచ్చిన వాట్సాప్ లింక్ను ఆమె క్లిక్ చేసిన వెంటనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది.
ఒక్కసారిగా ఆమె ఖాతా నుంచి రూ 21 లక్షలు డెబిట్ అయ్యాయి. స్కామర్లు ఆమె ఖాతాను హ్యాక్ చేసి మొత్తం నగదును లూటీ చేసిన తర్వాత వరలక్ష్మి సైబర్ క్రైమ్కు సమాచారం అందించారు. వాట్సాప్ లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఆమె ఖాతాలో నగదు మాయమైందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. వాట్సాప్ లింక్స్ ద్వారా సైబర్ నేరాలు ఇటీవల పెరిగాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లింక్లపై యూజర్లు క్లిక్ చేసిన వెంటనే స్కామర్లు బాధితుల ఫోన్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసి లూటీలకు పాల్పడుతున్నారని చెప్పారు. గుర్తుతెలియని నెంబర్, వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని, యూఆర్ఎల్ను సరిగ్గా చెక్ చేసుకుని అది సరైన లింక్ అని నిర్ధారణకు రావాలని సూచిస్తున్నారు. నగదు ప్రయోజనాలు కల్పించేలా ఉండే లింక్లు, మెసేజ్లను క్లిక్ చేయరాదని, వాటిని షేర్ చేయరాదని పోలీసులు కోరుతున్నారు. అలాంటి మెసేజ్లను స్కామర్లే ఎక్కువగా పంపిస్తుంటారని చెప్పారు.