విజయవాడ: అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడు బహిర్గతపరచాల్సిన అవసరం ఏంటని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించిన ఆయన ‘పెళ్లైన ఆరు నెల్లకు శుభలేఖ అచ్చేసినట్లుగా’ ఉన్నదని చమత్కరించారు. చర్చలు జరగడానికి ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పిందని మండిపడ్డారు. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను అప్రతిష్టపాలు చేసేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నదని ఆరోపించారు.
పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రామకృష్ణ చెప్పారు. ఈ పీఆర్సీ ఒప్పందం కారణంగా దిగువ శ్రేణి ఉద్యోగులు నెలకు రూ.4 వేలు చొప్పున నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తీవ్రంగా నష్టపోతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు. అశుతోష్ మిశ్రా నివేదికలో పేర్కొన్న ప్రకారమే 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాఉండగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం గౌరవించాలని సూచించారు.