తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రాజమండ్రిలో ఒక వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్ ద్వారా ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా పౌర సేవలకు ఆటంకాలు ఏర్పడవని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్, ఎంపీ భరత్ రామ్ అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు వాట్సాప్ నంబర్ను మంత్రి సురేష్, ఎంపీ భరత్రామ్ ఆవిష్కరించారు. నగర ప్రజలు తమ సమస్యలను 94940 60060 వాట్సాప్ నంబర్కు పంపి పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్ కే మాధవీలత సూచించారు.
ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, మెప్మా తదితర శాఖల అధికారులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే ముందు సంబంధిత పనుల వివరాలను ప్రదర్శించాలని మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. పనులు పూర్తికాగానే ప్రజాప్రతినిధులతో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రతి అభివృద్ధి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.125 కోట్లతో చేపట్టనున్న పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
ఇండోర్ స్టేడియం, కంబాల చెరువు, ఈట్ స్ట్రీట్, రివర్ ఫ్రంట్ బండ్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, మోడల్ రోడ్లు, పార్కులు, అర్బన్ హెల్త్ క్లినిక్లు తదితర సమగ్ర అభివృద్ధిపై పీపీటీ ద్వారా అధికారులు మంత్రి సురేశ్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ వీర్రాజు, వైసీపీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, రుడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, మున్సిపల్ ఎస్ఈ పాండురంగ రావు, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు.