Weather Update | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం గంటలకు 17 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. శనివారం రాత్రికి ఇది తుపాను ( రెమాల్) గా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. అర్ధరాత్రి సమయంలో సాగద్ ద్వీపం -ఖేపుపారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది.
కాగా, రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పింది.
శనివారం సాయంత్రం 6 గంటల నాటికి అనంతపురం రాయదుర్గంలో 38.5మిమీ, విజయవాడ తూర్పులో 34.5మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5మిమీ, విజయవాడ సెంట్రల్ లో 30.2మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 25 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.