అమరావతి: రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొన్నది.
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
కాగా, భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్నది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకున్నది. బ్యారేజీ నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి చేరుతున్నది. డెల్టా కాల్వలకు 6 వేల క్యూసెక్ల నీటిని అందిస్తున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.