అమరావతి : ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కానున్న ఐదు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ కి సన్నహాలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. 2023 మార్చి 23 న గడువు ముగుస్తున్నందున ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని షెడ్యూలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదుకు బహిరంగ ప్రకటన, నవంబరు 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకర ణకు తుది గడువును విధించింది. నవంబరు 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, నవంబరు 23 నుంచి డిసెంబరు 9వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది.
డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది . కాగా షెడ్యూలు ప్రకారం ఇవాళ్టీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూర, చిత్తూరు జిల్లాలకు కలిపి ఒక పట్టభద్రుల స్థానం, కడప అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఒకటి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఖాళీ కానున్నాయి.
అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు జిల్లాలకు ఒక నియోజకవర్గం, కడప,అనంతపురం, కర్నూలు జిల్లాకు మరో నియోజకవర్గానికి ఉపాధ్యాయ స్థానం ఖాళీ కానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారు. అధికార వైసీపీ ఒకడుగు ముందుకు వేసి ఎన్నికల బాధ్యతలను వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణుడికి ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు.