Viveka Murder Case | వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి విచారణను సీబీఐ వాయిదా వేసింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఎంపీ తండ్రి భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ వాయిదా వేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు అవినాష్రెడ్డిని విచారణకు పిలువనున్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఇదిలా ఉండగా.. అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. కోర్టులో అవినాష్రెడ్డి, సునీత లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కుట్రతోనే కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్రెడ్డి తరఫు లాయర్ వాదించారు. దస్తగిరి మీడియాతో మాట్లాడిన దాన్ని సునీత లాయర్ సమర్థించడమేంటన్నారు. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగారెడ్డి, దస్తగిరిలను వదిలేశారని, హంతకుల్ని వదిలేసి భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిల వెంట పడ్డారన్నారు. అయితే, వివేకా హత్యకు కారణాలు ఏంటం హైకోర్టు ప్రశ్నించింది. దానికి అవినాష్రెడ్డి లాయర్ స్పందిస్తూ.. నాలుగు కారణాలున్నాయని చెప్పారు.
వివేకా రెండో భార్యతో సునీతకు గొడవలు ఉన్నాయని, వ్యాపారలావాదేవీల్లో గంగిరెడ్డితో విభేదాలున్నాయని, సునీల్ యాదవ్ కుటుంబంతో వివాదం, రాజకీయ కారణాలు సైతం హత్యకు కారణాలు కావొచ్చని అవినాష్రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్ రెడ్డి కుటుంబం ప్రమేయం లేకుండా హత్య జరిగే అవకాశం లేదని శివశంకర్రెడ్డి చెప్పారని సునీతారెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గంగాధర్రెడ్డి స్టేట్మెంట్ సైతం అవినాష్రెడ్డి ప్రమేయాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో సీబీఐ విచారణ జరిగిన సమయంలో అవినాష్రెడ్డి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మరో వైపు సీబీఐ వాదనలు వినిపిస్తూ అవినాష్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. గతంలో నాలుగు సార్లు విచారించినా.. సహకరించలేదని పేర్కొంది.
వివేకా హత్య కుట్ర వైఎస్ ఎంపీకి ముందే తెలుసునని పేర్కొంది. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించామని, హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉందని చెప్పింది. హత్య రోజు ఎంపీ జమ్మలమడుగు దగ్గరలో ఉన్నట్లు విచారణ సమయంలో చెప్పినా.. ఇంట్లోనే ఉన్నట్లుగా మొబైల్ సిగ్నల్స్ ద్వారా తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హత్య రోజు రాత్రంతా ఫోన్ను ఎంపీ అసాధారణంగా వాడారని, హత్యకు ముందు.. తర్వాత ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారని సీబీఐ చెప్పింది. అవినాష్ రెడ్డికి ఉదయ్, జయప్రకాశ్రెడ్డితో సంబంధాలు తేలాల్సి ఉందని, సాక్ష్యాలు తారుమారు చేయడంలో అవినాష్రెడ్డిది కీలక పాత్ర అని, దాదాపు రూ.40కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించినట్లు సీబీఐ వాదించింది.