విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ దవాఖానా ఘటన అనంతరం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళ హత్య చోటుచేసుకున్నది. తాజాగా విశాఖలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బర్త్డే విషెస్ చెప్పాలంటూ పిలిపించుకుని మరీ ఆ టీడీపీ నేత బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
బాధిత బాలిక, ఆమె కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జీవీఎంసీ ఐదో వార్డు పరిధిలోని కొమ్మాది రాజీవ్ గృహకల్పలో నివసించే తోట నరేంద్ర టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇదే కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలితో పరిచయం పెంచుకున్నాడు. అన్నయ్యా అని పిలిచినా.. అవేమీ పట్టించుకోని నరేంద్ర మాత్రం ప్రేమ పేరిట ఆ బాలికను వేధించసాగాడు. ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించడంతో ఆ బాలిక ఆయన ప్రేమను అంగీకరించింది.
ఇలా ఉండగా, తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి విషెస్ చెప్పాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో భయపడిపోయిన సదరు బాలిక.. నరేంద్ర ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ తెలిపింది. అదే అదనుగా భావించిన నరేంద్ర.. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. తోట నరేంద్రను నిలదీశారు. పీఎం పాలెం పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నరేంద్రను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.