అమరావతి : విధి గర్భశోకం మిగిల్చిన రోజే.. ఆ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. యాధృచ్చికమో, దైవ సంకల్పమో తెలియదు కానీ.. తమ ఇద్దరు పిల్లలను కోల్పోయిన రోజే.. కవల పిల్లలకు జన్మనిచ్చారు ఆ దంపతులు. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే అని ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లాలోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు, వారి కుమార్తెలు గీతా వైష్ణవి(3), ధాత్రి అనన్య( ఏడాదిన్నర) తో పాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు.. 2019, సెప్టెంబర్ 15వ తేదీన విహారయాత్రకు బయల్దేరారు. రాయల్ వశిష్ట బోటులో రాజమండ్రి నుంచి భద్రాచలం పయనమయ్యారు. ఈ క్రమంలో దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామానికి సమీపంలో బోటు గోదావరిలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. భార్యాభర్తలు అప్పలరాజు, భాగ్యలక్ష్మి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారిద్దరి పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు పిల్లలు జన్మించిన అనంతరం భాగ్యలక్ష్మి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కానీ ఆ ఇద్దరు పిల్లలో గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను కోల్పోయామన్న బాధలో భాగ్యలక్ష్మి ఉంది. ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని భాగ్యలక్ష్మి తెలుసుకున్నది. దీంతో ఏడాది క్రితం డాక్టర్ సుధా పద్మశ్రీని అప్పలరాజు దంపతులు కలిసి.. తమ సమస్యను తెలిపారు.
ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల కోసం డాక్టర్ సుధా.. భాగ్యలక్ష్మికి చికిత్స ప్రారంభించింది. ఈ చికిత్స విజయవంతం కావడంతో.. సెప్టెంబర్ 15న భాగ్యలక్ష్మి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు కూడా ఆడపిల్లలే. నాడు బోటు ప్రమాదంలో కోల్పోయిన ఆడ పిల్లలే తమకు మళ్లీ జన్మించారని తల్లి భాగ్యలక్ష్మి ఆనందభాష్పాలు రాల్చింది. కవలల్లో ఒకరు 1.9 కేజీలు ఉండగా, మరొకరు 1.6 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.