తిరుమల : ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వ తేదీ వరకు తిరుమల పరిధిలోని వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 13 నుంచి 22 వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీటీడీకి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.కొవిడ్ కట్టడికి టీటీడీ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటుందని, భక్తులు సహకరించి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.