అమరావతి : అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై నిర్వహిస్తున్న గ్రామసభల తొలిరోజు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకతే ఎదురయ్యింది . ఇవాళ జిల్లాలోని లింగాయపాలెంలో నిర్వహించిన గ్రామసభకు 78 మంది హాజరై మున్సిపాలిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించగా ఒక్కరే మద్దతు తెలిపారు. ఉద్దండరాయుని పాలెంలో నిర్వహించిన రెండో సభల్లోనూ ప్రజలంతా ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
రాజధాని పరిధిలోని 22 గ్రామ పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను గ్రామ సభల ద్వారా ఆమోదింప చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశించగా ఈమేరకు ఇవాళ్టి నుంచి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఏడు నెలల క్రితం రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించగా ప్రజలు ఆ ప్రతిపాదన ను తిరస్కరించారు. మొత్తం 29 పంచాయతీలతో నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు రాజధాని పరిధి తుళ్లూరు మండలం లోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామ సభలను పదిరోజుల్లో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా, మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.