విశాఖ: తెలుగు సినిమాల్లో కనిపించే కథ, స్క్రీన్ప్లే.. ఆ గ్రామంలో కనిపించింది. ఓ యువతికి పెండ్లి చేసేందుకు ఊరంతా ఏకమైంది. పదేండ్లపాటు అక్కున చేర్చుకున్న గ్రామస్థులే.. ఘనంగా పెండ్లి చేసి అత్తారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అనాథలంటూ ఎవరూ ఉండరని.. మన మాటలు, చేతలే అనాథలుగా చేస్తాయని ఈ గ్రామస్థులు నిరూపించారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గుండుపాల గ్రామానికి చెందిన యువతి అమరావతి చిన్ననాటనే తల్లిదండ్రులు కాలం చేశారు. దాంతో అనాథగా మారిన ఆ యువతికి గ్రామస్థులే అండగా నిలిచారు. గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు చదువు చెప్పించారు. మధ్యాహ్నం వేళ స్కూళ్లో, రాత్రి పూట గ్రామస్థుల ఇండ్లలో భోజనం చేసేది. పదేండ్లుగా ఆ యువతిని అక్కున చేర్చుకున్నారు. ఆ యువతి ఏం కోరినా లేదనకుండా సమకూర్చారు.
కాగా, అమరావతిని చూసి మనుసు పారేసుకోవడంతో లింగంపేట నివాసి సురేష్కిచ్చి పెండ్లి చేసేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. పెండ్లి సమయం దగ్గర పడటంతో గ్రామస్థులు సమావేశమై చర్చించుకుని అన్నీ సమకూర్చేందుకు నిర్ణయించారు. ఆదివారం ఆ యువతి పెండ్లి లింగంపేటలో జరుగనున్నది. స్థానిక ఉపాధ్యాయుడు రాము సూచన మేరకు గ్రామానికి చెందిన చేనేత కుటుంబాలు బంగారు చెవి దుద్దులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ కలిసి టేకు మంచాలు, పరుపు, దిండ్లు, బీరువా సిద్ధం చేశారు. కొందరు పెండ్లి చీరలు కొన్నారు. మరికొందరు పెండ్లి భోజనాలకు నగదు అందించారు. ఇలా అంతా రేపటి పెండ్లికి తలా ఒక చేయి వేస్తున్నారు. వైభవంగా పెండ్లి జరిపి అత్తారింటికి పంపనున్న గ్రామస్థులు.. మనందరికీ మార్గదర్శకులుగా నిలిచారు.