YS Jagan | సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుని కను గుడ్లు పోగొట్టుకుంటారా? అని ప్రశ్నించారు. నుదిటి కాకుండా మరో చోట రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. సీఎం జగన్కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదని.. దాడి ఘటనపై రాజకీయాలు చేయకపోతే చాలు అని సూచించారు. ఘటనపై ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు అలవాటే అని మండిపడ్డారు.
ఈ ఘటనలో తన ఎడమ కంటికి కూడా గాయమైందని వెల్లంపల్లి తెలిపారు. భద్రతా సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు. తనకు కనుగుడ్డపై గీతలు పడ్డాయని.. చికిత్స తీసుకుంటానని తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని సింగ్నగర్ పీఎస్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ 307 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా, వెల్లంపల్లి కంటికి తీవ్రమైన గాయమైందని వైద్యులు నిర్ధారించారు. ఆయన ఎడమ కన్ను ఎరుపు రంగులోకి మారిందని, విశ్రాంతి అవసరమని తెలిపారు.