విజయవాడ: రౌడీషీటర్లను ఎప్పుడు పట్టుకుని అరెస్ట్ చేద్దామా అని ఎదురుచూసే పోలీసులు.. కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. రౌడీషీటర్లలో సత్ప్రవర్తన తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏకంగా జాబ్ మేళానే చేపడుతున్నారు. దీనికి వేదికగా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియం నిలువనున్నది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద సహకారంతో మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ షీటర్లతో సమావేశం నిర్వహించారు. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డీసీలు, బీసీలు, సస్పెక్ట్లు, రౌడీ షీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు.
గంజాయి, గుట్కా, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో మెలగాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు నగర బహిష్కరణ చేపడతామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారి పేరిట ఉన్న షీట్లను ఎత్తివేసి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయవాడ వెస్ట్జోన్ డీసీపీ బాబూరావు తెలిపారు. నేరస్థులలో మార్పు తీసుకొచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలలో రౌడీ షీటర్లు పాల్గొనకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఈ జాబ్ మేళా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.