AP News ఓ ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి పారిపోయిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మేనమామ ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నవీన్, ఒంగోలుకు చెందిన శ్వేత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన వాడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. బెజవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధి హుజూర్నగర్లో నవీన్ ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్వేత కుటుంబసభ్యులు కూడా విజయవాడ వచ్చారు. చిట్టినగర్లో నివాసం ఉంటున్న శ్వేత మేనమామ శ్రీనివాస్ను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం నవీన్ ఇంటికి వెళ్లారు. నవీన్ కుటుంబసభ్యులతో మాట్లాడిన శ్వేతను తీసుకుని వచ్చేశారు. కానీ కాసేపటికే శ్వేత ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్వేతను ఎలాగైనా బుజ్జగించి తీసుకొద్దామని ఆమె కుటుంబసభ్యులు మళ్లీ నవీన్ ఇంటికి వెళ్లారు. శ్వేత ఎక్కడ అని నవీన్ను నిలదీశారు. నా దగ్గర నుంచి మీరే తీసుకెళ్లి.. ఇప్పుడొచ్చి మళ్లీ నన్నే ప్రశ్నిస్తున్నారా? అంటూ నవీన్ సీరియస్ అయ్యాడు. శ్వేత బంధువులతో గొడవకు దిగాడు. శ్వేత కుటుంబసభ్యులు కూడా తగ్గకపోవడంతో గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన నవీన్.. శ్వేత మేనమామ శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. ఛాతిలో బలంగా కత్తి దింపాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు. కంగారుపడిన బంధువులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.