అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే చిరాకు ప్రదర్శించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వరుసగా ఆయనపై ట్వీట్లు విసురుతూ విమర్శిస్తున్నారు. ట్విట్టర్లో యాక్టీవ్గా ఉండే విజయసాయిరెడ్డి.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తుంటారు. ఇదే వరసలో శనివారం చంద్రబాబుపై మరో ట్వీట్ పేల్చారు. జన్మలో నువ్ మారవు బాబూ..! అంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు విజయసాయిరెడ్డి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను విమర్శిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చౌకబారు డ్రామాలు మీ పేటెంట్ చంద్రబాబూ… మీతో అగ్రనటులు కూడా పోటీ చేయలేరని రాశారు. వరద నీటిని బాటిళ్లలో నింపి వాటినే జనం తాగుతున్నారని నమ్మించాలని చూశారంటూ సెటైర్ వేశారు. అయితే దానిని చూసిన వరద బాధితులే నవ్వుకుంటున్నారని, మీరు జన్మలో మారరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
రెండు రోజుల క్రితం చంద్రబాబు తన పర్యటనలో బురద నీటి బాటిల్ను చూపుతూ వీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, తనకు స్థానిక టీడీపీ నేతలే ఆ బాటిల్ ఇచ్చి చంద్రబాబుకు ఇవ్వమన్నారని ఒక వృద్ధురాలు వెల్లడించింది. దాంతో ఆ విషయాన్ని వైసీపీ నేతలు టీడీపీ నేతల బండారాన్ని బయట పెట్టారు. దీనిపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.