అమరావతి: మాజీ మంత్రి , యడ్లపాటి వెంకటరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. వరిష్ట రాజకీయ నాయకుడు యడ్లపాటి మృతి విచారకరమని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులైన ఆయన క్రమశిక్షణాయుత జీవన విధానంతో ప్రజా సేవలో గడుపుతూ నూరేళ్లకు పైబడి అర్ధవంతమైన, ఆదర్శవంతమైన పరిపూర్ణ జీవితాన్ని సాగించారని, ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని ఉప రాష్ట్రపతి వెల్లడించారు.
యడ్లపాటి వెంకటరావు మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం తెలియజేశారు. హైదరాబాద్లోని వెంకటరావు నివాసానికి చంద్రబాబు వచ్చి ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం ఆశయాల సాధనకు తీవ్రంగా కృషి చేశారని వారన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి జీవితం ఎంతో ఆదర్శమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి గుర్తుండిపోతారని అన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యడ్లపాటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.