హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 2 కొత్త జిల్లాలపై ఒకవైపు రచ్చ జరుగుతున్నది. జిల్లాల పేర్లు, భౌగోళిక అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏపీలో జిల్లాల పేర్లపై తెలంగాణ నుంచి కూడా ఒక డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ డిమాండ్ను కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు చేయడం విశేషం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య సేవలు ఎంతో గొప్పవని చెప్పిన వీహెచ్.. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టాలని జగన్ ప్రభుత్వం యోచించకపోవడం శోచనీయమన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని జగన్ ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేశారు. అలాగే, తమ నేతల పేర్లు కూడా పెట్టాలని వెనకబడిన వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని వీహెచ్ చెప్పారు.
కడప జిల్లాకు రాజశేఖర్రెడ్డి పేరు, విజయవాడకు ఎన్టీరామారావు పేరు, మన్యం జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు పెట్టిన జగన్ ప్రభుత్వం.. అలనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఒక జిల్లాకు పెట్టాలనేది మరిచిపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు.