న్యూఢిల్లీ : పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి, వాటిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు. వెంకయ్యతో రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్జోషి, డాక్టర్ జితేంద్రసింగ్ తదితరులు సమావేశమయ్యారు.
అనంతపురం జిల్లాలోని పాలసముద్రంలో ఏర్పాటుచేసిన బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతి గురించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. బెంగళూరులోని మిసైల్స్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్కు అనుసంధానంగా 2015లో ఈ సంస్థకు శంకుస్థాపన జరిగింది. 900 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్న ఈ సంస్థ దేశంలో అతిపెద్దది. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ (ఎన్ఏసీఈఎన్) పురోగతి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మిథాని, నాల్కో ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా నెల్లూరులో ఏర్పాటు చేయ తలపెట్టిన హై ఎండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, తయారీ సంస్థ ఏర్పాటు పనుల పురోగతి గురించి కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లా తుపిలిపాళెంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పురోగతి గురించి కేంద్ర శాస్త్రచ సాంకేతిక శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నుంచి ఉపరాష్ట్రపతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలన్న తపనతో విభజన జరిగినప్పటి నుంచి వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వెంకయ్య కృషి చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తూ వచ్చారు. 2015, 2016లో కేంద్ర మంత్రి హోదాలో చొరవ తీసుకున్న వెంకయ్యనాయుడు.. సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి ఆయా ప్రాజెక్టులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారు.