Srisailam | శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా పాల్గుణ మాస అమావాస్య రాత్రి ఘడియలు కన్నడిగులకు అత్యంత పవిత్రమైనవి. మంగళవారం రాత్రి శివదీక్ష శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశానికి ముందుగా వీరాచార భక్తులు శస్త్రాలను తమ కనుబొమ్మల నుండి పొడుచుకొని సంప్రదాయాలను పాటించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మరికొందరు నాలుక, చంపలు,పెదవులు, చేతులు, నోటి నుండి శస్త్రాలను గుచ్చుకుని అలవోకగా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కర్ణాటకలోని వీరశైవ భక్తులు తమ మూఢ భక్తితో ముక్కంటిని మది నిండా నింపుకొని వీరాచార విన్యాసాలు చేశారు.
ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహలను పల్లకిలో కొలువు ఉంచి ఊరేగింపుగా శివదీక్ష శిబిరాలకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల తర్వాత వివిధ రకాల వేషధారణలతో వీరభద్రున్ని అస్త్ర, శస్త్రాలను పఠిస్తూ ఖడ్గ విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం మహాశివుడిని స్మరిస్తూ ఎర్రగా మండే నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళారు. పాదయాత్రగా వచ్చి పవిత్ర పాతాళ గంగలో మునిగి మల్లయ్య దర్శనం చేసుకొని, అమావాస్య రోజు అగ్నిగుండం ప్రవేశం చేశారు.
శ్రీశైల మహా క్షేత్రంలో అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి మంగళవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్దజలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు ఈవో లవన్న ఆధ్వర్యంలో చేశారు. లోక కళ్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆరు బయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడం వల్ల భూత, ప్రేత, పిశాచ, దుష్ట గ్రహ దోషాలు తొలిగి సర్వ కార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలో కొలువైన కుమారస్వామి, నందిమండపంలో కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక పూజలు అభిషేకార్చనలు చేశారు.
శ్రీశైలంలో ఏప్రిల్ 11న అమ్మవారికి నిర్వహించే సాత్విక బలి కుంభోత్సవానికి ఆనవాయితీ ప్రకారం ఆరంభ ప్రతీకగా ప్రతి మంగళవారం కొబ్బరికాయలు సమర్పిస్తున్నట్లు ఆలయ ఏఈవో హరిదాస్ తెలిపారు. అమ్మవారి ఎదుట కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అమ్మవారి సింహ మండపం వద్ద హారతులు సమర్పించడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహించే వారు స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం ప్రత్యేకం.