తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల భద్రత ముఖ్యమని ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు.
డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమల లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమల కు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు, ఢిల్లీ ఐఐటీ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు.