తిరుపతి: శ్రీకాకుళం నుంచి వచ్చిన రైలులో మృతదేహం బయటపడి కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్న రైలు జనరల్ బోగీలో మృతదేహం బయటపడింది. తిరుపతి రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన బోగీలను శుభ్రం చేస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ కార్మికులు వెంటనే ఈ విషయాన్ని స్టేషన్ అధికారులకు తెలియజేశారు.
తిరుపతి రైల్వే స్టేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని, మృతుడి ఒంటిపై నలుపు రంగు టీ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని రుయా దవాఖానకు తరలించి పోలీసులు భద్రపరిచారు. మృతుడిని గుర్తించేవారు తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించాలని స్థానిక పోలీసులు సూచించారు. మృతుడు ఎవరై ఉంటారనేది పోలీసుల విచారణలో తేలనున్నది. ఎవరైనా చంపారా లేకా తిరుపతికి ప్రయాణిస్తూ చనిపోయాడా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.