శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అంబరానంటుతున్నాయి. మూడోరోజు సోమవారం ఉదయం ఆలయంలో అర్చకులు స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు
జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు నిర్వహించారు.
అనంతరం శ్రీభ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు జరిపించారు.
సాయంత్రం ఉత్సవమూర్తుల ప్రభోత్సవం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో ప్రభను శోభాయమానంగా అలంకరించారు.
ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ తీసుకువచ్చి ప్రభపై అధిష్టింపజేసిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
ప్రభను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. చైత్ర శుద్ధ పాడ్యమిరోజు స్వామిఅమ్మవార్లు రథోత్సవంలో క్షేత్ర పురువీధుల్లో విహరించేందుకు ముందు చండీశ్వరుడు ముందుగా క్షేత్ర పర్యటన చేసి వచ్చేందుకు ప్రభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు.
నందివాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో పనుల్లో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని ఇతిహాసాల్లో చెప్పబడింది.
శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే విద్యాప్రాప్తితోపాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకులు ఉమేశ్ పట్వారీ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి