తిరుపతి : సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతీయ సంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాద్యకళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ (TTD) ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి(Chairman Karunakar Reddy) తెలిపారు. టీటీడీకి చెందిన వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో కళావైభవం పేరిట మూడు రోజుల దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం తిరుపతి మహతి కళామందిరంలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ సంగీతం(Music), సాహిత్య కళలతోనే మానవ నాగరికత వికసించిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంగీత, నృత్య కళలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఎక్కువ మంది ఈ కళలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు.
ఈ కళలను బతికించుకునేందుకు ప్రజలు ఉపాధి కోసం కాకుండా దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయంగా ఉండేలా నేర్చుకోవాలన్నారు. పురాతనమైన ఈ కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర, డోలు పాఠశాలను నిర్వహిస్తోందని చెప్పారు. పీఠాదీశ్వరి మాతా రమ్యానంద భారతి, పద్మశ్రీ (Padma Sri) అవార్డు గ్రహీత, ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.