తిరుపతి : గోకులాష్టమి రోజునే కాకుండా రోజూ ప్రతి ఆలయం, ప్రతిఇంట్లో గోపూజ జరగాలన్నదే టీటీడీ లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గోపూజ నిర్వహించే ఆలయాలకు ఆర్థిక వనరులు లేకపోతే వాటికి తోడ్పాటు అందించే ఆలోచన కూడా చేస్తామని ఆయన చెప్పారు. గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం టీటీడీ గోసంరక్షణ శాలలో గోకులాష్టమి – గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వామి వారి ఆశీస్సులతో బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 200 ఆలయాలకు గోవులు, దూడలను దానంగా ఇచ్చామన్నారు. ఇంకా ఆలయాలు, మఠాలు ముందుకు వస్తే గోమాత దూడను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గో పూజ విశిష్టతను భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్ద సప్తగో ప్రదక్షణ మందిరాన్ని నిర్మించి నట్లు ఆయన తెలిపారు. గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ, రైతులకు ఆవులు, ఎద్దులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న పంటలను రైతుల నుంచి టీటీడీనే కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. అనంతరం చైర్మన్ గోసంరక్షణ శాలలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరంలో వైవి సుబ్బారెడ్డి గోపూజలో పాల్గొన్నారు. వేణుగోపాల స్వామివారి పూజలో పాల్గొని గోమాతలకు దాణా, మేత, పండ్లు అందించారు.